Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమలులో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు 2026 జూలై 15 వరకు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో-252, దానికి చేసిన సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్తో పాటు మరికొందరు జర్నలిస్టులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అక్రిడిటేషన్ సౌకర్యాలను కొనసాగించాలని పిటిషనర్లు కోరారు.
వారి తరఫున అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పెషల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసు తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మరియు సంబంధిత సౌకర్యాలను కొనసాగించేందుకు అవకాశం లభించింది. అదే సమయంలో అక్రిడిటేషన్కు సంబంధించిన వివరాలు—జారీ చేసిన కార్డులు, తిరస్కరించిన దరఖాస్తులు, వాటి కారణాలు—కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ల తరఫున ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ దాఖలైంది. ఈ అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలించనుంది.
ఈ తీర్పును తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ స్వాగతించింది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, శాశ్వత పరిష్కారం కోసం న్యాయపోరాటం కొనసాగుతుందని ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు.








