Indian Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు దాదాపు 0.6 శాతం వరకు పెరిగాయి.
సెన్సెక్స్ 457 పాయింట్లు లాభపడి 77,121 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 24,047 స్థాయిలో ట్రేడింగ్ సాగించింది. ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 76,856 వద్ద, నిఫ్టీ 23,945 వద్ద ప్రారంభమయ్యాయి.
రియల్టీ, ఔషధ, ఐటి, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటి, ఫార్మా రంగాల సూచీలు 2 శాతం వరకు పెరిగాయి. మధ్యస్థ, చిన్న కంపెనీల సూచీలు కూడా సుమారు 1 శాతం లాభపడి మార్కెట్లో ఉత్సాహాన్ని చూపించాయి..
అయితే యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇదే సమయంలో అస్థిరత సూచిక ఇండియా విక్స్ 2 శాతం కంటే ఎక్కువగా తగ్గి 19.24 స్థాయికి చేరింది. విశ్లేషకుల ప్రకారం నిఫ్టీకి 23,800–23,900 మధ్య మద్దతు ఉండగా, 24,200 వద్ద నిరోధం ఉంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, ముఖ్య ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ టెక్ కంపెనీల ఫలితాలపై మదుపరులు దృష్టి సారించారు. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.








