Indian Stock Market: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో మెరుగుదల, ముఖ్యంగా అమెరికా–ఇరాన్(America-Iran) మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచి మార్కెట్లకు సానుకూల సంకేతాలుగా మారాయి. ఇరాన్తో చర్చలు జరపనున్నట్లు అమెరికా ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో ఆశావహ వాతావరణం నెలకొంది. దీనికి తోడు ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్లకు మరింత బలాన్ని ఇచ్చింది. ఉదయం 9:41 గంటల సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు పెరిగి 78,613 స్థాయిలో, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 24,557 వద్ద కొనసాగాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13గా నమోదైంది.
నిఫ్టీ సూచీలో పలు ప్రముఖ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, సిప్లా, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు 5 శాతం తగ్గి 83.5 డాలర్లకు చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రధాన మద్దతుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ALSO READ: Pawan Kalyan | 39 పతకాలు.. ఒకే త్రివర్ణ పతాకం.. టీమ్ ఇండియాకు పవన్ కళ్యాణ్ అభినందనలు








