Iran-Israel War: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు కేవలం ప్రాంతీయ సమస్యగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇరు పక్షాలు వెంటనే దాడులను నిలిపివేసి, ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర మానసిక, శారీరక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధ ప్రభావం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని భారత్ స్పష్టం చేసింది. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలను సైనిక మార్గం కాకుండా దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.
అదే సమయంలో పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీతో పాటు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. అనవసర ప్రయాణాలను నివారించాలని, ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా స్వదేశానికి తిరిగి రావాలని సూచించాయి.
ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 2,361 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు, అవసరమైన అన్ని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.








