Retirement Age: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న పీఎస్యూలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. దీంతో సంబంధిత సంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు తమ సేవలను కొనసాగించే అవకాశం పొందనున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరికొంతకాలం విధులు నిర్వహించేలా ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది.
ఇప్పటికే 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న వారు తిరిగి విధుల్లో చేరే అవకాశాన్ని కల్పించారు. అయితే రిటైర్మెంట్ తేదీ నుంచి తిరిగి ఉద్యోగంలో చేరే వరకు గల కాలానికి ఎలాంటి జీతభత్యాలు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబోమని స్పష్టం చేశారు.
కోర్టు తీర్పుల ఆధారంగా సేవలు అందిస్తున్న ఉద్యోగులు సర్వీస్ బెనిఫిట్స్ విషయంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని ప్రయోజనాలు పొందుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్షిక ఇంక్రిమెంట్లు నోషనల్ ప్రాతిపదికన మంజూరు చేయడంతో పాటు సీనియారిటీ, పదోన్నతుల విషయంలో కూడా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో లేని కాలాన్ని సీనియారిటీ గణనలో పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అయితే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ తిరిగి ఉద్యోగంలో చేరే ఆసక్తి లేని ఉద్యోగులు గత నిబంధనల ప్రకారమే పదవీ విరమణ పొందిన వారిగా కొనసాగవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.








