NEET UG 2026 Results: నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు హాజరైన అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సమాచారం వెల్లడించింది. తిరిగి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను జులై 20లోపు ప్రకటించే లక్ష్యంతో మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే ఫలితాలు విడుదలయ్యే ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ, జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించింది. అనంతరం జూన్ 25న ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జూన్ 28 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించగా, వేల సంఖ్యలో అభ్యర్థులు తమ సూచనలు, అభ్యంతరాలను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతి అభ్యంతరాన్ని నిపుణుల కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు సమర్పించిన ఆధారాలు, సంబంధిత ప్రశ్నలపై నిపుణుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతే తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. సరైన అభ్యంతరాలను గుర్తించిన వారికి చెల్లించిన ఫీజును తిరిగి చెల్లించే ప్రక్రియ కూడా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఫలితాలు వెలువడిన అనంతరం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, జిప్మర్, కేంద్ర మరియు డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించనుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని 85 శాతం స్టేట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎంబీబీఎస్ తొలి సంవత్సరం తరగతులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతాయని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు.








