Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన తొలి ఈ-కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వాటిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన నిర్ణయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు అక్కడ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు కూడా ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులకే పరిమితమైన ఆహార పథకం పరిధి మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం, కొన్ని ప్రాంతాల్లో అల్పాహారం అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో రోజంతా పాఠశాలల్లో సేవలు అందించే సిబ్బంది కూడా అదే సదుపాయాన్ని పొందనున్నారు.
దీనివల్ల ఉపాధ్యాయులపై ఆర్థిక భారం కొంత తగ్గడమే కాకుండా, విద్యాసంస్థల్లో వారి అందుబాటు, సమయపాలన మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని విద్యా రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాఠశాలల పనితీరును మెరుగుపరచే దిశగా ఇది ఉపయోగపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.








