Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.
విద్యార్థుల సంక్షేమం, బోధనా నాణ్యత, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు చేయనుంది. కడప మోడల్ను ఆధారంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అలాగే ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీని మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థినులకు మెరుగైన వసతి కల్పించేందుకు 53,180 బంక్ బెడ్ల ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా విద్యా కిట్ల పంపిణీ కొనసాగుతుందని అధికారులు వివరించారు. అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలు అందేలా ప్రత్యేక విధానం రూపొందించాలని మంత్రి ఆదేశించారు. వారి పేరుపై బ్యాంక్ ఖాతాలు తెరిచి నేరుగా నిధులు జమ చేయాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్ల ద్వారా సాయం అందించాలని సూచించారు.
ఇది వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వెనుకబడిన ప్రాంతాల్లో అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. తెలుగు భాష బోధనను మరింత బలోపేతం చేయాలని కూడా స్పష్టం చేశారు. స్కూళ్లలో డిజిటల్ లెర్నింగ్ను వేగవంతం చేయడానికి క్రోమ్ బుక్స్తో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే పాఠ్యపుస్తకాల విక్రయాన్ని ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యా రంగంలో పారదర్శకత, ఆధునికీకరణే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ:Indo-Pacific | ఇండో పదం తొలగింపు వెనుక అమెరికా వ్యూహం ఏంటి? పూర్తి విశ్లేషణ








