Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET)కు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలషించారు. రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
పరీక్షల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం తదుపరి డీఎస్సీ (DSC) ప్రక్రియను కూడా నిర్ణీత షెడ్యూల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందిస్తోందని వెల్లడించారు. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగంలో ఖాళీల భర్తీ, నాణ్యమైన బోధన వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ALSO READ: AP Aqua Farmers | ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.1.50కే విద్యుత్ సరఫరా








