ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ (Centre for Sports Excellence) అకాడమీకి ఘనంగా శంకుస్థాపన జరిగింది. భావి ఒలింపియన్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల క్రీడా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. విశాఖలోని తోటగురువు ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ వేడుకలో పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.
పీవీ సింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ అకాడమీ కేవలం బ్యాడ్మింటన్కే పరిమితం కాకుండా బహుళ క్రీడలకు శిక్షణ అందించే సమగ్ర కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాల కోర్టులు, హైపర్ఫార్మెన్స్ కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ విభాగం, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ సెంటర్, ఫిజియోథెరపీ, పోషకాహార మద్దతు, రికవరీ సదుపాయాలతో పాటు యువ క్రీడాకారుల కోసం వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా సింధు పేర్కొన్నారు. సరైన శిక్షణ, ఆధునిక సదుపాయాలతో భవిష్యత్ ఒలింపియన్లను తీర్చిదిద్దే కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ అకాడమీతో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలో ప్రముఖ స్పోర్ట్స్ హబ్గా ఎదగనుండగా, తెలుగు రాష్ట్రాల క్రీడా రంగానికి ఇది కొత్త దిశను చూపే ప్రాజెక్టుగా మారనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ALSO READ: CM Revanth Reddy | ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీలు








