2027 World Cup: వరల్డ్ కప్ సన్నాహాల్లో టీమిండియాకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ సమస్యలు జట్టు ప్రణాళికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు మరో స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న పాండ్యా కనీసం మూడు వారాలు విశ్రాంతిలో ఉండనున్నారని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో ఈ గాయం చోటుచేసుకుంది. ఆ సీజన్లో ఆయన కేవలం 10 మ్యాచ్లకే పరిమితమై, చివరి దశలో జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకు పెద్ద లోటుగా మారింది. ఐపీఎల్ సమయంలో ఎదురైన గాయాల కారణంగా కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్పై కూడా అనిశ్చితి కొనసాగుతోంది.
కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసిన బీసీసీఐ, ఇప్పుడు హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఎలా భర్తీ చేయాలన్న దానిపై ఆలోచనలో పడింది. ఆల్రౌండర్ విభాగంలో అతని లేమి జట్టు సమతౌల్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వరల్డ్ కప్ సన్నాహాల దశలో వరుస గాయాలు టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక ఆటగాళ్లు లేకుండా జట్టు ఎలా ప్రదర్శన ఇస్తుందన్నది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.








