Dagadarthi Airport: రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రతిపాదించిన కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. సుమారు రూ.648 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తాజాగా బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలో డీబీఎఫ్వోటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును చేపట్టే కాంట్రాక్ట్ సంస్థను ఈ నెల 17న ఎంపిక చేయనున్నారు. ఎంపికైన సంస్థతో సుమారు 45 ఏళ్ల పాటు రాయితీ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి మొత్తం 650 ఎకరాలు కేటాయించగా, అదనంగా కమర్షియల్ మరియు సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం మరో 726 ఎకరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ సహా పలు కేంద్ర శాఖల నుంచి అవసరమైన అనుమతులు లభించాయి.
టెండర్ ప్రక్రియ ప్రకారం టెక్నికల్ బిడ్లు జూన్ 12న, ఫైనాన్షియల్ బిడ్లు జూన్ 17న తెరవనున్నారు. ఎంపికైన సంస్థకు 15 రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేయనున్నారు. తొలి దశలో రన్వే, టెర్మినల్ భవనం, కార్ పార్కింగ్, షాపింగ్ ఏరియా వంటి మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. ప్రాజెక్ట్ మొదటి దశ 2028–29 ఆర్థిక సంవత్సరానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశ పూర్తయితే రోజుకు సుమారు 2,282 మంది ప్రయాణికులను సేవలందించగల సామర్థ్యం ఉండనుంది. అలాగే పీక్ అవర్స్లో 799 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. చెన్నై–కోల్కతా జాతీయ రహదారి 16తో లింక్ రోడ్డు ద్వారా ఈ ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేయనున్నారు.
Dagadarthi Airport | ఏపీలో కొత్త విమానాశ్రయం దిశగా కీలక అడుగు.. దగదర్తి ప్రాజెక్ట్ వేగం
-








