TTD కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు ఎక్కువగా దర్శనం కల్పించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేయాలని టీటీడీ యోచిస్తోంది. అలాగే స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్ల ద్వారా దర్శనం పొందడానికి భక్తులు దాదాపు 20 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.
వీఐపీ దర్శనాలను రద్దు చేస్తే ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించడం ద్వారా రోజుకు వేలాదిమందికి త్వరగా దర్శనం కల్పించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ విధానం అమలులోకి వస్తే భక్తులు 8 నుంచి 12 గంటల్లోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రోజుకు 2 నుంచి 3 గంటల సమయం వీఐపీ దర్శనాలకు కేటాయిస్తున్నారు. ఈ సమయాన్ని సామాన్య భక్తులకు మళ్లిస్తే సుమారు 15 వేల మందికి అదనంగా దర్శనం కల్పించవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద రోజుకు 80 వేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇక అన్ని కేటగిరీల దర్శనాలను తగ్గించి ఒకే విధానంలో దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ ఆలోచిస్తోంది. దీంతో భక్తుల నిరీక్షణ సమయం తగ్గి దర్శనం వేగవంతం అవుతుంది.
గత మూడేళ్ల గణాంకాల ప్రకారం మే, జూన్, జూలై నెలల్లో నెలకు సుమారు 23 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
also read:Varanasi Video Leaks | జక్కన్నను కలవరపెడుతున్న వారణాసి వీడియో లీక్








