RBI: దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు ప్రారంభించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్ల(Polymer Notes)ను ప్రవేశపెట్టే ప్రణాళికపై పని ప్రారంభించింది. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్న ఆర్బీఐ, ఇందుకోసం భద్రతా ప్రమాణాలతో కూడిన పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల సరఫరాకు గ్లోబల్ టెండర్ జారీ చేసింది.
నకిలీ నోట్ల తయారీకి అడ్డుకట్ట
ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే 2027 నుంచి పెద్దఎత్తున పాలిమర్ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నోట్లలో పారదర్శక విండో, మెటాలిక్ ఫీచర్లు, మాగ్నెటిక్ సెక్యూరిటీ థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడెసెంట్ డిజైన్ వంటి అధునాతన భద్రతా అంశాలు ఉండనున్నాయి. దీంతో నకిలీ నోట్ల తయారీని అడ్డుకోవడంతో పాటు, సాధారణ నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నే అవకాశం ఉంటుంది. టెండర్లో పాల్గొనే సంస్థలకు ఆర్బీఐ కఠిన నిబంధనలు విధించింది. చైనా, పాకిస్థాన్కు సంబంధం లేని సరఫరా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది.
అలాగే సెంట్రల్ బ్యాంకులకు పాలిమర్ మెటీరియల్ సరఫరా చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పాలిమర్ నోట్ల ప్రయోజనాలపై అధ్యయనం కొనసాగుతోందని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. టెండర్ బిడ్ల సమర్పణకు ఆగస్టు 18 చివరి తేదీగా నిర్ణయించారు.








