Telangana Heatwave: తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రభావాన్ని చూపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు, అంటే ఏప్రిల్ 16 వరకు, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఆలూరు మండలం మాచెర్ల గ్రామంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే నల్గొండ జిల్లా ఘన్పూర్లో 43.1 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా భిక్నూర్లో 42.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 42.9 డిగ్రీలు నమోదయ్యాయి.
రాజధాని హైదరాబాద్లో ప్రస్తుతం 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది 42 డిగ్రీలకు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసర అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు.
ALSO READ:Ambedkar Jayanti | సమానత్వానికి ప్రతీక అంబేద్కర్.. చంద్రబాబు ప్రశంసలు








