Tamil Nadu electios: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల హామీల పోటీ వేడెక్కుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి మహిళల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతపై దృష్టి సారించిన పలు కీలక హామీలను ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర నేతల సమక్షంలో ఈ హామీల పత్రాన్ని విడుదల చేశారు.
ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అదనంగా ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ.10,000 నగదు సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
పండుగల సందర్భంగా—పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం—ప్రతి ఏడాది మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే మహిళలు ఇ-స్కూటర్ల(E-Scooters) కొనుగోలుకు రూ.25,000 వరకు సబ్సిడీ, గృహ అవసరాల కోసం రూ.8,000 విలువైన కూపన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ కల్పిస్తామని చెప్పారు.
జల్లికట్టు సంప్రదాయాన్ని ప్రోత్సహించేందుకు ఎద్దులను పెంచే వారికి నెలకు రూ.2,000, పోటీల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
విద్యాసంస్థల్లో భద్రత కోసం నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం, దేవాలయాల్లో స్థానికులకు ప్రత్యేక దర్శన సమయం కల్పించడం వంటి హామీలను కూడా బీజేపీ ప్రకటించింది.








