Telangana government: తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్లు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకుని నెలలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో తీపి వార్త అందనుంది. ఇప్పటికే బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం రెండు లక్షల కొత్త పెన్షన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రకారం, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవీ బాధితులు వంటి వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ అందుతోంది.
ప్రభుత్వం మరో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. పెన్షన్ పెంపు అంశం కూడా ఎన్నికల హామీగా ఉన్నప్పటికీ, ఇంకా అమలులోకి రాలేదు.
అదే సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు ఉండటంతో వాటిని దశలవారీగా పరిశీలించి అర్హులకు కార్డులు ఇవ్వనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా వేగంగా కొనసాగుతోంది. మొదటి విడత గృహ నిర్మాణాలు పూర్తవుతూ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. రెండో విడత మంజూరు ప్రక్రియ జూన్లో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మొత్తం మీద పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భారీ ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ALSO READ: DMK MLA | “విజయ్ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదు”.. డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ ఫైర్








