దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదికగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూలై 20 నుంచి సమావేశాలను నిర్వహించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో సుమారు మూడు వారాల వ్యవధిలో 19 సిట్టింగ్లు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే తుది షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (CCPA) ఆమోదం అవసరం. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహిళలకు శాసనసభలు, లోక్సభలో రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశాలపై సవరణలతో కూడిన ప్రతిపాదనలు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’కు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలు, విద్యా సంస్కరణలు, యాంటీ డోపింగ్ నిబంధనల్లో మార్పులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, కార్పొరేట్ చట్టాల్లో సవరణలు, సెక్యూరిటీస్ మార్కెట్కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సభ ముందుకు వచ్చే అవకాశముంది.
రాజకీయంగా కూడా ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వివిధ పార్టీల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు సభలో ప్రతిధ్వనించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)కు చెందిన కొందరు ఎంపీల గుర్తింపు, లోక్సభలో వారి సీట్ల కేటాయింపు వంటి అంశాలపై కూడా నిర్ణయాలు వెలువడే అవకాశముంది. మరోవైపు ప్రతిపక్షాలు నీట్ పరీక్ష వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంధన ధరలు, ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
దీంతో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చట్టసభా కార్యక్రమాలతో పాటు రాజకీయ విమర్శలు, వాదోపవాదాలకు కూడా కేంద్రబిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Parliament Monsoon Session | జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. రాజకీయ వేడి పెంచనున్న కీలక అంశాలు
-








