Telangana Weather: మండుతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే వేడితో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణం కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ముఖ్యంగా సికింద్రాబాద్, బాలానగర్, బోయిన్పల్లి, అమీర్పేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, లక్డీకాపూల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. వర్షంతో రోడ్లు తడిసిపోగా, ఎండ తీవ్రత తగ్గిపోయింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాల్లో వచ్చే 2–3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.








