Munugode: నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మానవీయతను మరోసారి చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య ఖర్చుల బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన మనవడిని కాపాడాలని కోరుతూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఎలాంటి ఆస్తులు లేవని, తనకు ఉన్న ఏకైక ఆధారం మనవడేనని కన్నీటితో తన బాధను వివరించాడు.
వృద్ధుడి ఆవేదన విన్న రాజగోపాల్ రెడ్డి స్పందించి చిన్నారికి అవసరమైన వైద్య చికిత్సను తమ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా కల్పించారు. పేద కుటుంబాలకు సహాయం చేయడం, అవసరమైన వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై స్థానికులు, పలువురు ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడుతున్నారు.








