ED Raids: కేరళ రాజకీయాల్లో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తిరువనంతపురంలో ఉన్న పినరయి విజయన్ అద్దె నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
ఈ కేసులో సీఎంఆర్ఎల్–ఎక్సాలోజిక్ సంస్థల మధ్య జరిగిన నెలసరి చెల్లింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ ఐటీ సంస్థకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ సంస్థను వీణా విజయన్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అదేవిధంగా సీపీఎం ఎమ్మెల్యే పీఏ మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే వీణా విజయన్ను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.
ఈ కేసుపై కేరళ హైకోర్టు ఈడీ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ మరింత వేగం పుంజుకుంది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), ఆదాయపు పన్ను శాఖ కూడా కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం.
ఈడీ అధికారులు డిజిటల్ పరికరాలు, ఆర్థిక రికార్డులు, ట్రాన్సాక్షన్ వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. “మంత్లీ రిటైనర్స్” పేరుతో చెల్లింపులు జరిగినట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఈ సోదాలపై లెఫ్ట్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నివాసంపై ఈడీ దాడులు జరగడం కేరళ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.








