Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా చేరింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళం పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దుల రక్షణతో పాటు సముద్ర వాణిజ్య మార్గాల భద్రతను కాపాడడంలో భారత నౌకాదళం కీలక బాధ్యత నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో చేపట్టిన “ఆపరేషన్ ఊర్జా సురక్ష” ను ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్, రూ.9,000 కోట్లకు పైగా విలువైన సరుకును తీసుకెళ్తున్న 18 వాణిజ్య నౌకలకు భారత నౌకాదళం భద్రత కల్పించిందని చెప్పారు. ఈ చర్యతో దేశ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడంలో నౌకాదళం ఎంత కీలకంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టమైందన్నారు.
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి సుదూర సముద్ర ప్రాంతాల్లో దీర్ఘకాలం విధులు నిర్వహించడంతో పాటు, కీలక సముద్ర మార్గాల భద్రత, వ్యూహాత్మక మిషన్ల అమలులో కీలక పాత్ర పోషించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ నౌక తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా సముద్రంలోని సుదూర ప్రాంతాల్లో కూడా విధులు నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘మహా సాగర్’ దృష్టికోణానికి అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా ఎదుగుతోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, సముద్ర దోపిడీ నిరోధం, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు, మానవతా సహాయక చర్యలు వంటి అనేక సందర్భాల్లో భారత నౌకాదళం ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని నిరూపించిందని కొనియాడారు.
అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థల సమన్వయంతో భారత సాయుధ బలగాల సామర్థ్యం మరింత పెరిగిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన చివరి స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నౌకాదళ కమాండ్కు అదనపు బలాన్ని అందించడంతో పాటు, అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల భద్రతలో కీలక పాత్ర పోషించనుందని రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.








