Gujarati woman: అమెరికాలో భారతీయులపై మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్కు చెందిన ఓ భారతీయ మహిళను వర్జీనియాలో గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి హ***త్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గుజరాత్లోని మోహసానా జిల్లాకు చెందిన 45 ఏళ్ల మేఘనా పటేల్ గత 10 ఏళ్లుగా అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తూ ఓ సూపర్మార్కెట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 23న స్టోర్లో కస్టమర్లు ఎవరూ లేని సమయంలో దుండగుడు కస్టమర్ మాదిరిగా వేషధారణలో స్టోర్లోకి ప్రవేశించాడు.
ప్యాంట్, జాకెట్, గ్లవ్స్, మాస్క్, టోపీ ధరించి వచ్చిన అతడు మేఘనా పటేల్ ఉన్న కౌంటర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు సాధారణంగా మాట్లాడుతున్నట్లు నటించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులకు పాల్పడ్డాడు. తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం దుండగుడు కౌంటర్లోకి వెళ్లి మరిన్ని కాల్పులు జరిపి, అక్కడి వస్తువులు తీసుకుని పరారైనట్లు సమాచారం.
ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దృశ్యాలు చూసిన భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మేఘనా పటేల్ మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు గుజరాత్లో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె తల్లిదండ్రులు కర్సన్భాయ్ పటేల్, కపిలాబెన్ భారత్లో నివసిస్తుండగా, భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షిబెన్, కుమారుడు స్మిత్ అమెరికాలో ఉన్నారు.
ఈ ఏడాది అమెరికాలో హ**త్యకు గురైన నాలుగో గుజరాతీ వ్యక్తిగా మేఘనా పటేల్ నిలిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికాలోని భారతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.








