రాష్ట్రంలో అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ను ఇకపై మరింత బలంగా అమలు చేస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) స్పష్టం చేశారు. సమాజంలో 5 శాతం మాత్రమే ఉన్న నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, పోలీస్ స్టేషన్కు వచ్చే 95 శాతం సామాన్య ప్రజల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించడమే నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను మరింత సమర్థంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
విద్యాసంస్థల్లో డ్రగ్స్ సమస్యపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు తప్పనిసరి చేయనున్నట్లు, క్యాంపస్లో డ్రగ్స్ దొరికితే పూర్తిగా యాజమాన్యాలదే బాధ్యత అని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరమని, దీన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పోలీసు శాఖలో చేరేవారు సేవా భావంతో ఉండాలని, డబ్బు లేదా అధికారం కోసమైతే రావొద్దని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఫిట్ కాప్ యాప్ ద్వారా 75 వేల మంది సిబ్బంది ఆరోగ్యాన్ని మానిటర్ చేయనున్నట్లు తెలిపారు. నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.








