Chicken prices: తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా కిలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
వారం రోజుల క్రితం వరకు హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.240కు లభించగా, ప్రస్తుతం అది రూ.350 నుంచి రూ.370 వరకు చేరింది. దీంతో సామాన్య వినియోగదారులు కిలో కొనుగోలు చేయలేక అరకిలోతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్ల పెంపకం ఫారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధిక వేడి కారణంగా కోళ్లు ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒత్తిడికి గురవడం, పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటం వంటి సమస్యలు పెరిగాయి. దీంతో మార్కెట్కు సరఫరా భారీగా తగ్గింది. సాధారణంగా వేసవిలో వినియోగం తగ్గినా, ఈసారి డిమాండ్కు తగిన సరఫరా లేక ధరలు అదుపు తప్పాయి.
దీనితో పాటు దాణా ఖర్చులు, రవాణా వ్యయం కూడా పెరగడం ధరల పెరుగుదలకు కారణమైంది. శీతలీకరణ వాహనాల అవసరం పెరగడంతో వ్యాపారులపై అదనపు భారం పడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చికెన్ ధర కిలో రూ.400 చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చికెన్ ధరలు పెరగడంతో వినియోగదారులు మటన్, చేపల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం మటన్ కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు ఉండగా, చేపల ధరలు రకం ఆధారంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఉన్నాయి.








