Assam CM: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గువాహటిలో జరిగిన ఘనమైన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హిమంతతో పాటు మరో నలుగురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 126 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 102 సీట్ల మద్దతు లభించింది. బీజేపీ ఒంటరిగానే 82 స్థానాలు గెలుచుకోగా, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీలకు చెరో 10 సీట్లు దక్కాయి. ఈ విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ విజయం ద్వారా హిమంత బిశ్వ శర్మ అస్సాంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి భాజపా నేతగా చరిత్ర సృష్టించారు.
ఇక ప్రమాణస్వీకార వేడుక సమయంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు. ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో అతడి వద్ద తూటాలు లభించడంతో వెంటనే అదుపులోకి తీసుకుని బసిస్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రధానమంత్రి సహా కీలక నేతలు హాజరైన సమయంలో ఈ ఘటన జరగడం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.








