TDP Cycle Rally: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం రేపు (జూన్ 5) అన్ని జిల్లాల్లో ఒకే సమయంలో జరగనుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం వంటి సమస్యలు ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని ఆయన స్పష్టం చేశారు.
సైకిల్ వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గుతుందని, కాలుష్యం నియంత్రణకు తోడ్పడుతుందని, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని పల్లా పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ రోజువారీ ప్రయాణాల్లో సైకిళ్లను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ నుంచి తన నివాసానికి సైకిల్పై ప్రయాణించనున్నారని తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక సంకేతాత్మక చర్యగా నిలుస్తుందని చెప్పారు.
ఇంధన సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రజలు చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పుకు దారి తీసేలా ముందుకు రావాలని, “నేను సైతం” అనే భావనతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.








