NEET paper leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్లో మరోసారి రాజకీయ వేడిని పెంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. అయితే చర్చను సభా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని రిజిజు తెలిపారు. చర్చకు సంబంధించిన సమయం, విధానం వంటి అంశాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు విపక్షాలు మాత్రం కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్పై వాయిదా తీర్మానం కింద చర్చ జరపాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. మూడు రోజులుగా వాయిదా తీర్మానం కోరుతున్నా అనుమతించడం లేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్పై చర్చ, మంత్రి రాజీనామా, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ అనే మూడు అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ALSO READ: Mana Illu- Mana Lokesh | మంగళగిరిని రాష్ట్రానికే రోల్ మోడల్ చేస్తాం: నారాలోకేష్ లోకేశ్








