ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్(Suryastra rocket) వ్యవస్థ విజయవంతంగా ప్రయోగించబడింది. ప్రైవేట్ సంస్థ నిబె లిమిటెడ్ రూపొందించిన ఈ లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేరుకోవడంలో విజయవంతమైంది.
ఈ వ్యవస్థలో రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉండగా, మరొకటి 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదు. పరీక్షల్లో 150 కిలోమీటర్ల రేంజ్ రాకెట్ లక్ష్యానికి సుమారు 1.5 మీటర్ల దూరంలో, 300 కిలోమీటర్ల రేంజ్ రాకెట్ 2 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని తాకినట్లు సమాచారం.
మిలిటరీ పరిభాషలో దీన్ని సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ (సీఈపీ) అని పిలుస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే, వ్యవస్థ అంత కచ్చితమైనదిగా పరిగణిస్తారు.
సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, రాడార్ స్టేషన్లు, మిలిటరీ స్థావరాలు, రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది. సంప్రదాయ ఫిరంగి వ్యవస్థలతో పోలిస్తే ఇది ఆధునిక గైడెడ్ టెక్నాలజీతో మరింత ఖచ్చితంగా దాడులు చేయగలదు.
150 కిలోమీటర్ల వెర్షన్ను ఆర్మీ తక్షణ యుద్ధ అవసరాలకు వినియోగించవచ్చు. ఇక 300 కిలోమీటర్ల వెర్షన్ శత్రు భూభాగంలో లోతైన లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో ప్రైవేట్ సంస్థలు రాకెట్లు, డ్రోన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనివల్ల విదేశీ ఆధారిత కొనుగోళ్లు తగ్గి, దేశీయ ఉత్పత్తి పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.








