Rashmi Gautam: నటి రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై ఘాటుగా స్పందించారు. తాను ఏ మతానికి గానీ, రాజకీయ పార్టీకి గానీ వ్యతిరేకం కాదని, తన అభ్యంతరం కేవలం జంతువులపై జరుగుతున్న క్రూరత్వంపైనేనని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ నేత ప్రదీప్ చింత చేసిన విమర్శలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె, తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
గతంలో కూడా ఇలాంటి విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని రష్మీ తెలిపారు. జంతుబలి, పండుగల సమయంలో జరిగే హింసపై తాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తున్నానని చెప్పారు. గణపతి ఉత్సవాల సమయంలో ఏనుగులపై జరిగిన ఘటనలను ప్రశ్నించినప్పుడు తనను దేశద్రోహిగా కూడా అభివర్ణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జంతువులపై హింస అంశాన్ని ప్రస్తావిస్తే ప్రజలు మరో అంశాన్ని లాగి వివాదం సృష్టిస్తున్నారని, కానీ సమస్య పరిష్కారంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని ఆమె విమర్శించారు. జంతు సంక్షేమానికి అనుకూలంగా పనిచేసే ఏ పార్టీ అయినా ఉంటే దానికి తాను మద్దతు ఇస్తానని కూడా స్పష్టం చేశారు.
ఈ వివాదం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి నిర్వహించిన నిరసన ర్యాలీతో ప్రారంభమైంది. ఇంధన ధరల పెరుగుదలపై జరిగిన ఆ ర్యాలీలో ఆటోను ఎడ్ల బండిపై ఉంచి ప్రదర్శించడం జరిగింది.
దీనిపై రష్మీ స్పందిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం జంతువులను ఉపయోగించడం, వాటిపై హింస చూపడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది.








