CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గత నెలలో పాలనాపరమైన సమీక్ష సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి ముక్కుకు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. సర్జరీ అనంతరం కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, దీర్ఘకాలంగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
డాక్టర్ల సూచనల మేరకు పవన్ కల్యాణ్ గత 10 రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. గతంలో కూడా పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సమయంలో చంద్రబాబు ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే.
అదే రోజు సీఎం చంద్రబాబు, నంది హిల్స్లో ఇటీవల మరణించిన రీజెన్సీ అధినేత జి.ఎన్. నాయుడు కుటుంబ సభ్యులను కూడా కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








