Rammohan Naidu: విమాన ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి సమాచారం నిజం కాదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానాల్లో ఉపయోగించే “ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)” లో ఇథనాల్ను కలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న వార్తలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఇలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) రెండు వేర్వేరు ఇంధనాలని, వాటిని ఒకటిగా చూడటం సరైనది కాదని తెలిపారు.
విమాన భద్రతకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రయాణికుల్లో అనవసర భయాలు ఏర్పడతాయని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని ప్రయాణికులకు సూచించారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారయ్యే “సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF)”కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఇంధనం అనేక దశల్లో కఠినమైన పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే వినియోగానికి అనుమతిస్తారని తెలిపారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశాలని మంత్రి స్పష్టం చేశారు. విమానయాన రంగంపై తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Rajasthan | రోగుల ప్రాణాలతో చెలగాటం.. పైకప్పు పెచ్చులు పడి మహిళకు గాయాలు








