భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు(PV Sindhu) జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో అదిరిపోయే ఆటతీరుతో ముందుకు సాగుతోంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయే (చైనా)పై వరుస గేమ్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఈ విజయంతో టోర్నీలో భారత్ తరఫున మిగిలిన ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హాన్ యూయే ఆధిపత్యం కోసం ప్రయత్నించినా.. సింధు తన అనుభవాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా పుంజుకుంది. కచ్చితమైన షాట్లు, వేగవంతమైన ఆటతో ర్యాలీలపై పట్టు సాధించిన సింధు తొలి గేమ్ను 21-16తో కైవసం చేసుకుంది.
రెండో గేమ్లో సింధు మరింత దూకుడుగా ఆడి వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 8-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రత్యర్థి పోరాడినా సింధు ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు. చివరకు రెండో గేమ్ను 21-14తో గెలిచి కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్ను ముగించింది. హాన్ యూయేపై సింధు హెడ్ టు హెడ్ రికార్డు 8-1కి చేరింది. ప్రపంచ పదో ర్యాంక్లో ఉన్న సింధు క్వార్టర్ ఫైనల్లో జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడనుంది. ప్రపంచ నంబర్ వన్ అన్ సె యంగ్ టోర్నీ నుంచి వైదొలగడంతో ఒకుహారా తదుపరి దశకు చేరుకుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిలా-తనీషా క్రాస్టో జోడీ ఓటమితో నిష్క్రమించింది. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, ఉన్నతి హూడా కూడా తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు.








