AP Weather Update: బంగాళాఖాతంలో నెలకొన్న బలమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం జూలై 16న శక్తిని పుంజుకుని బలమైన అల్పపీడన ప్రాంతంగా పరిణమించింది.
దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి చురుగ్గా కొనసాగుతోంది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గురువారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా గురువారం నుంచి శనివారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచించారు.
AP Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
-








