తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’(Tholimudda) అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రకటించారు. చిన్నారులకు మరింత మెరుగైన పోషకాహారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన 2,500 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వాటిని ఒకేసారి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి శృతి ఓజాతో కలిసి మంత్రి సీతక్క జిల్లా సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాఖ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, అంగన్వాడీ సేవల విస్తరణ, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.








