Commonwealth Games: భారత జూడో చరిత్రలో కామన్వెల్త్ క్రీడలు కొత్త మైలురాయిగా నిలిచాయి. ఇప్పటివరకు ఈ క్రీడలో ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవని భారత్.. ఈసారి ఒకే రోజులో రెండు బంగారు పతకాలను(Double Gold) కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే స్వర్ణం గెలిచి కామన్వెల్త్ జూడోలో తొలి భారత మహిళా ఛాంపియన్గా చరిత్ర సృష్టించగా, కొద్దిసేపటికే పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్(Harsh Singh) మరో స్వర్ణాన్ని అందించి భారత్ ఖాతాలో రెండో బంగారు పతకాన్ని జమ చేశాడు. మరోవైపు యామిని మౌర్య(Yamini Mourya) ఫైనల్ వరకు అద్భుతంగా పోరాడినా త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది.
23 ఏళ్ల అస్మిత డే ఫైనల్లో కెనడాకు చెందిన హైది కువాచ్పై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించింది.నిర్ణీత సమయంలో ఇరువురు సమానంగా నిలవడంతో మ్యాచ్ ‘గోల్డెన్ స్కోర్’ దశకు చేరుకుంది. ఈ కీలక సమయంలో అస్మిత డే అద్భుత ప్రతిభ కనబరిచి నిర్ణయాత్మక పాయింట్ సాధించి, కామన్వెల్త్ జూడో చరిత్రలో భారత తొలి స్వర్ణ పతక విజేతగా నిలిచింది. అదే జోరును కొనసాగించిన హర్ష్ సింగ్, ఆస్ట్రేలియా స్టార్ జాషువా కట్జ్ను ‘వాజా-అరి’ టెక్నిక్తో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
మహిళల 57 కేజీల విభాగంలో యామిని మౌర్య గోల్డెన్ స్కోర్ వరకు పోరాడినా చిన్న తప్పిదంతో పెనాల్టీ ఎదుర్కొని రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా, డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ సీమ కలీరామ్ 58.65 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని గెలిచి భారత్ పతకాల జాబితాను మరింత బలోపేతం చేసింది. ఈ విజయాలతో కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడో కొత్త స్వర్ణ యుగానికి నాంది పలికినట్లైంది.








