Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి మోడీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించి అక్కడి సౌకర్యాలను తెలుసుకున్నారు.
విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించేందుకు వేదికపైకి చేరుకోగా, వేలాదిగా హాజరైన ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభలో మరో ప్రత్యేక ఆకర్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణ(Bobbili Veena)ను కానుకగా అందించారు. ఈ అపురూప బహుమతిని ప్రధాని స్వీకరించగా, వేదికపై ఉన్న ప్రముఖులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ దృశ్యం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు మరింత ఊతం లభించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ALSO READ: Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టు భవనాన్ని ప్రారంభించిన పీఎం.. ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి








