Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు ప్రారంభంలో మరింత చురుకుదనాన్ని సంతరించుకుని అనేక ప్రాంతాల్లో వర్షాల జోరును పెంచనున్నాయని ఐఎండీ వెల్లడించింది. గత కొన్ని వారాలుగా పలు రాష్ట్రాల్లో అసమానంగా కురిసిన వర్షాల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన రుతుపవనాల వర్షలోటు ప్రస్తుతం 14 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని తెలిపింది.
ప్రస్తుతం మహారాష్ట్రపై కొనసాగుతున్న లోతైన అల్పపీడన వ్యవస్థ అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి విస్తారంగా తేమను భూభాగంలోకి తీసుకువస్తోందని ఐఎండీ వివరించింది. అదే సమయంలో అరేబియా సముద్రం నుంచి తేమను మోసుకొచ్చే సోమాలీ జెట్ కూడా బలపడటంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారాయని పేర్కొంది. లోతైన అల్పపీడనం, చురుకైన రుతుపవన ద్రోణి, బలమైన సోమాలీ జెట్ ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా పెరిగిందని తెలిపింది.
మధ్య, వాయువ్య భారతదేశంలో సీజనల్ వర్షపాతం సాధారణ స్థాయికి చేరువవుతుండగా, దక్షిణ ద్వీపకల్పం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇంకా వర్షలోటు కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడన వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ కొత్త వాతావరణ వ్యవస్థ ప్రభావంతో మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు కొనసాగితే దేశవ్యాప్తంగా వర్షలాలోటు మరింత తగ్గడంతో పాటు జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగి, ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా నీరు అందడంతో వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ALSO READ: Peddi Sudarshan Reddy | ఉద్యమ నాయకుడికి అంతిమయాత్ర.. నర్సంపేటలో నివాళుల వెల్లువ








