భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా(Bharathiraja) మరణవార్త సినీ అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా భావోద్వేగ సందేశంతో నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో స్పందించిన పవన్ కల్యాణ్, భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి మాత్రమే కాకుండా కోట్లాది మంది సినీ ప్రేమికులకు తీరని లోటుగా అభివర్ణించారు. తన ప్రత్యేక కథన శైలి, సృజనాత్మక దృక్పథంతో భారతీరాజా దక్షిణాది చిత్రసీమకు కొత్త దారులు చూపించారని కొనియాడారు. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ ఆయన సినిమాలు విశేష ఆదరణ పొందాయని పవన్ గుర్తు చేశారు. తన సినీ ప్రయాణంలో ఆరు జాతీయ అవార్డులు అందుకోవడం ద్వారా భారతీరాజా అసాధారణ ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆరాధన’, అలాగే జాతీయ అవార్డు అందుకున్న ‘సీతాకోకచిలుక’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. గ్రామీణ జీవన విధానం, మానవ సంబంధాల్లోని భావోద్వేగాలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించడంలో భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
ఈ కష్టకాలంలో భారతీరాజా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
Bharathiraja | భారతీరాజా మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-








