Pawan Kalyan: నన్ను ఎవరు ఆపలేరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో తప్పనిసరిగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తాను స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని, ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని పవన్ తెలిపారు. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో జనసేన చురుకైన పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు.
తనను హైదరాబాద్ రావద్దంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని ఆయన అన్నారు. తన ప్రయాణాన్ని ఆపే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు ఇక్కడే పెద్ద పదవులు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్న జనసేన ఇక్కడ రాజకీయంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు భయపడి వెనకడుగు వేయబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో జనసేన పార్టీ శాశ్వతంగా కొనసాగుతుందని, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.








