Srinivasa Mangapuram: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆయన కుటుంబం నుంచి వచ్చిన మహేశ్ బాబు ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో కొత్త తరం హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు.
మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో అతను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా యాక్షన్తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.
ఇటీవల విడుదలైన గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. జయకృష్ణ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కోణాల్లో అతను తన తండ్రి రమేశ్ బాబును గుర్తు చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడాని హీరోయిన్గా పరిచయం అవుతోంది.
ఆమె కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త జంటగా జయకృష్ణ–రషా థడాని జోడీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








