Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం పాకిస్థానే భరిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. సాధారణంగా ఈ వ్యయాన్ని భారత్, పాకిస్థాన్ సమానంగా పంచుకోవాల్సి ఉన్నా, భారత్ పాల్గొనకపోవడంతో ఇస్లామాబాద్ ఒక్కటే చెల్లింపులు చేస్తోంది.
హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA)లో కొనసాగుతున్న విచారణ కోసం ఇప్పటికే 6 లక్షల డాలర్లకుపైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వివాదం కిషన్గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రాజెక్టులు సింధు జలాల ఒప్పందానికి విరుద్ధమని పాకిస్థాన్ ఆరోపిస్తూ పీసీఏను ఆశ్రయించింది. అయితే ఇలాంటి సాంకేతిక అంశాలను న్యూట్రల్ ఎక్స్పర్ట్ మాత్రమే పరిశీలించాలని, ఒకేసారి రెండు ప్రక్రియలు నడపడం ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని భారత్ వాదిస్తోంది.
అంతేకాక, పీసీఏకు ఈ కేసును విచారించే అధికారమే లేదని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకునే వరకు సింధు జలాల ఒప్పందం అమలును భారత్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగిస్తోంది. భారత్ దూరంగా ఉంటే, ఈ విచారణకు సంబంధించిన భవిష్యత్ ఖర్చులన్నీ కూడా పాకిస్థానే భరించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.








