Pakistan: శత్రు దేశం అయిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన సందర్భంగా మరోసారి కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని ప్రస్తావించడం తో భారత్ దీనిని తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తూ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు.
ఈ భేటీ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మళ్లీ చర్చలోకి తీసుకురావడం గమనార్హం. అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో కూడా కాశ్మీర్ విషయంపై ప్రస్తావన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, జమ్మూ కాశ్మీర్లో తాజా పరిస్థితులను చైనా ప్రతినిధులకు వివరించినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన చైనా, కాశ్మీర్ సమస్యను “చారిత్రకంగా మిగిలిన వివాదం”గా పేర్కొంటూ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత పరిష్కారం అవసరమని వ్యాఖ్యానించింది.
గత 2024 సంయుక్త ప్రకటనతో పోలిస్తే ఈసారి కూడా దాదాపు ఇదే తరహా పదజాలం ఉపయోగించబడినట్లు తెలుస్తోంది. అప్పట్లో కూడా కాశ్మీర్ను దీర్ఘకాలిక వివాదంగా పేర్కొంటూ పరిష్కారానికి ఐరాస మార్గదర్శకాలను సూచించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా భారత అంతర్భాగమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇతర దేశాలకు వ్యాఖ్యానించే హక్కు లేదని భారత్ తేల్చిచెప్పింది.
అంతేకాకుండా చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగంలో చేపట్టే కార్యకలాపాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది.








