Bakrid: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్లో గొర్రెలు, మేకల వ్యాపారులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగ సీజన్ రద్దీని ఆసరాగా చేసుకుని నకిలీ డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా వ్యాపారులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాపారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మోసగాళ్లు ఫోన్పే వంటి అసలు యాప్స్ను పోలిన నకిలీ అప్లికేషన్లు ఉపయోగించి చెల్లింపు జరిగినట్లు తప్పుడు స్క్రీన్షాట్లు చూపిస్తున్నారని తెలిపారు. దీంతో వ్యాపారులు డబ్బు వచ్చిందని నమ్మి గొర్రెలు, మేకలను అప్పగిస్తున్నారని వివరించారు. ఇటీవల కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు రూ.68 వేల విలువైన జీవాలను ఫేక్ పేమెంట్ ద్వారా తీసుకెళ్లినట్లు గుర్తించారు.
అలాగే రాజేంద్రనగర్లో మరో ఘటనలో నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన మేకలను ఇదే తరహాలో మోసం చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై బాధితులు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసిన తర్వాత డబ్బు జమ కాలేదని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీపీ సజ్జనార్ వ్యాపారులకు కీలక సూచనలు చేస్తూ, కేవలం స్క్రీన్షాట్లు లేదా సక్సెస్ మెసేజ్లను నమ్మవద్దని చెప్పారు. తప్పనిసరిగా తమ మొబైల్లో బ్యాంక్ యాప్ లేదా SMS ద్వారా డబ్బు వచ్చిందా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. పెద్ద లావాదేవీలకు నగదు చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే డయల్-100కి సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. బక్రీద్ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు.








