హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ఆయిల్ క్యాన్లో అసలు ఆయిల్కు బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలో చోటుచేసుకుంది.
స్థానికంగా నివసిస్తున్న శరత్ యాదవ్ అనే వ్యక్తి ఉదయం ప్రముఖ డెలివరీ యాప్లో 5 లీటర్ల ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికే డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. అయితే ఇంట్లో వంట కోసం ఆయిల్ క్యాన్ ఓపెన్ చేయగా అందులో ఆయిల్కు బదులు నీళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు.
ఈ ఘటనతో కస్టమర్ వెంటనే జెప్టో కస్టమర్ సపోర్ట్ను సంప్రదించాడు. అయితే అక్కడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్రాండ్ నమ్మకంతో కొనుగోలు చేసిన ఉత్పత్తిలో ఇలా జరగడం తీవ్ర నిరాశ కలిగించిందని వినియోగదారుడు వాపోయాడు.
ఈ ఘటనపై వినియోగదారుడు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. డెలివరీ సర్వీస్ల నాణ్యతపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లలో చర్చకు దారి తీసింది.







