AP Heatwave: ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల ప్రకారం, ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో ఇప్పటికే 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన వేడి ప్రభావానికి గురవుతున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం కొన్ని జిల్లాల్లో 43°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కూడా తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలోని 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 37 మండలాల్లో సాధారణ వడగాలులు ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే నంద్యాల జిల్లా సంజామలలో 44.6°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురజాల, కడప, మార్కాపురం ప్రాంతాల్లో కూడా 44°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని అధికారులు సూచించారు. గుండె, బీపీ, షుగర్ ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
తగినంత నీరు తాగడం, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వేడి గాలుల నుంచి రక్షణ కోసం తల కప్పుకొని బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.








