Australia: బంగ్లాదేశ్ టూర్ కోసం ఆస్ట్రేలియా టీ20 జట్టులో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సిరీస్లో పాల్గొనకపోవడంతో, అతని స్థానంలో భారత సంతతికి చెందిన ఆల్రౌండర్ నిఖిల్ చౌదరికి జట్టులో అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఢిల్లీలో జన్మించిన 30 ఏళ్ల నిఖిల్ చౌదరి తుది జట్టులో అవకాశం దక్కించుకుంటే, 1964 తర్వాత భారత్లో జన్మించి ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి భారత సంతతి పురుష ఆటగాడిగా చరిత్రలో నిలవనున్నాడు. ఇది ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిగా భావిస్తున్నారు. బంగ్లాదేశ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో నిఖిల్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని జట్టులో ఆడమ్ జంపా, మాథ్యూ కునెమన్లతో కలిసి స్పిన్ విభాగంలో అతను కీలక పాత్ర పోషించనున్నాడు.
లెగ్ స్పిన్ బౌలింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో స్థిరంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నిఖిల్ ప్రత్యేకత. దేశవాళీ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ లీగ్లలో అతని ప్రదర్శన ఆకట్టుకోవడంతోనే జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. బిగ్ బాష్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ తరఫున, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అనుభవం అతనికి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా సమాచారం ప్రకారం, నిఖిల్ చౌదరి శుక్రవారం జట్టుతో కలవనున్నాడు. జూన్ 17 నుంచి చట్టోగ్రామ్ వేదికగా ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
1996లో ఢిల్లీలో జన్మించిన నిఖిల్, దాదాపు పదేళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. భారత దేశవాళీ క్రికెట్ దశలో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న అనుభవం కూడా అతనికి ఉంది.








