6G technology: దేశంలో అత్యాధునిక మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించడం, కొత్త పేటెంట్లను సృష్టించడం, స్పెక్ట్రమ్ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం వంటి లక్ష్యాలతో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు ప్రారంభం కానున్నాయి. టెలికాం శాఖతో పాటు అంతరిక్ష రంగ సంస్థ IN-SPACe వంటి సంస్థల మధ్య సమన్వయం అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 6G సేవలను సమర్థంగా అమలు చేయాలంటే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
భవిష్యత్తులో సెల్యులర్ టవర్లను ఉపగ్రహాలు మరియు లో ఎర్త్ ఆర్బిట్ (LEO) నెట్వర్క్లతో అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు పరిశీలనలో ఉన్నాయి.దీనివల్ల ఎలాంటి దూర ప్రాంతమైనా సరే, గ్రామాలు మరియు తీర ప్రాంతాల్లో కూడా స్థిరమైన ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. అంతేకాకుండా అంతరిక్షం నుంచి భూమి వరకు కనెక్టివిటీ కోసం కూడా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
6G ద్వారా హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ వంటి అధునాతన సేవలు అందుబాటులోకి రానుండగా, డేటా ప్రాసెసింగ్, నిల్వ, సమాచార మార్పిడి మరింత వేగవంతం కానుంది. ప్రపంచ 6జీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచ 6జీ పేటెంట్లలో భారత్ వాటా సుమారు 6 నుంచి 8 శాతం మధ్య ఉండగా, 2030 నాటికి దానిని 10 శాతానికి పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటివరకు సుమారు 4,000కు పైగా 6జీ సంబంధిత పేటెంట్లు భారత్లో నమోదయ్యాయి.
ఈ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి 2023లో ‘భారత్ 6G అలయన్స్’ను ఏర్పాటు చేశారు. పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారత్ను 6జీ సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా నిలపాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది.








