Srisailam Reservoir: కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న కృష్ణా వరద జలాలు ఎట్టకేలకు శ్రీశైలం జలాశయానికి చేరనున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో ప్రవాహం పెరగడంతో బుధవారం నుంచి జలాశయానికి వరద నీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దీంతో సాగునీటి కొరతపై ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాల రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు దాదాపు నిండిపోవడంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి సుమారు 80 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 84,300 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఈ ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు చేరుతుండగా, అక్కడి నుంచి మంగళవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు వదిలారు. అవసరమైతే జూరాల క్రస్ట్ గేట్లను కూడా ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 41.279 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, పూర్తి సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుత ప్రవాహం కొనసాగితే జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో తుంగభద్ర జలాశయానికి కూడా వరద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్లో 136.99 టీఎంసీలు, పులిచింతలలో 29.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
ALSO READ: Bhogapuram Airport | విశాఖకు బదులుగా భోగాపురం.. ఆగస్టు 17 నుంచి కొత్త విమానాశ్రయం సేవలు








