Bogatha Falls: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఆకర్షణీయంగా మార్చినా, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులను కూడా తీసుకొచ్చాయి. ములుగు(Mulugu) జిల్లాలోని ప్రసిద్ధ బొగత జలపాతం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో అటవీ ప్రాంతాల్లో గత పది గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జలపాతం నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పరిస్థితిని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ములుగు జిల్లా వాజేడు(Wajedu) మండలం చీకుపల్లి సమీపంలోని ఈ పర్యాటక కేంద్రానికి సాధారణ రోజుల్లో వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం రాళ్లు జారిపడే ప్రమాదం, ఆకస్మిక వరద ఉద్ధృతి ఉండే అవకాశం ఉండటంతో ఎవరూ జలపాతం వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జలపాతం పరిసరాల్లో పోలీసు, అటవీ శాఖ సిబ్బందిని మోహరించారు. వరద తీవ్రత తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.








